వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలోని కమ్యునిటీ హెల్త్సెంటర్లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఇల్లంద గ్రామానికి చెందిన సట్ల హేమలత(40) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్యులు పరీక్షలు చేసి గర్భసంచిలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక హేమలత కుటుంబసభ్యులు వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సూపరింటెండెంట్ నర్సింహస్వామి నేతృత్వంలో వైద్యులు సోమశేఖర్, రాజ్కుమార్ల బృందం మంగళవారం ఉదయం శస్త్రచికిత్స చేశారు. ఆమె గర్భసంచిలో సుమారు 4 కిలోల బరువు కలిగిన కణతిని తొలగించారు. హేమలత ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.