ఏ పథకమైనా ముందు జీవో ఇవ్వాలి. విధివిధానాలు ఖరారు చేయాలి. తర్వాతే దరఖాస్తులు స్వీకరించాలి. కానీ.. ఎటువంటి విధివిధానాలు లేకుండా పథకానికి దరఖాస్తులు స్వీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. అందుకే ఇన్ని సందేహాలు. ఎవరు, ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ప్రజల అవస్థలు పడుతున్నారు.
– హరీశ్రావు
Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేవరకు కాలయాపన చేస్తూ ఆరు గ్యారెంటీలను ఎగవేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. కాలయాపనతో దాటవేయాలని, ఆ తర్వాత హామీలను ఎగవేయాలని, కొన్నింటిలో కోతలు విధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంతో హరీశ్రావు మీడియాతో చిట్చాట్ చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని తెలిపారు. వందరోజుల సమయం ఉంది కదా? ఇప్పుడే తొందరెందుకని కాలయాపన చేస్తున్నారని, ఫిబ్రవరిలోనే లోక్సభ ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకునే విధానం చూస్తే ఆరు గ్యారెంటీల ఎగవేతలో భాగమేననే సందేహం కలుగుతున్నదని అన్నారు. ‘ఏ పథకమైనా ముందు జీవో ఇవ్వాలి. విధివిధానాలు ఖరారు చేయాలి.
ఆ తర్వాతే దరఖాస్తులు స్వీకరించాలి. కానీ.. రాష్ట్ర చరిత్రలో ఎటువంటి విధివిధానాలు లేకుండా దరఖాస్తులు స్వీకరించడం ఇదే తొలిసారి. మార్గదర్శకాలుంటే ఏ పథకానికి ఎవరు దరఖాస్తు చేయాలో? ఎలా దరఖాస్తు చేయాలో? స్పష్టత ఉండేది. రేషన్కార్డుకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ప్రజల అవస్థలు పడుతున్నారు. ఆధార్ అప్డేట్, కేవైసీలు అవసరమే లేదు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు ఆన్లైన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు, ఆన్లైన్, పరిశీలన, అర్హుల జాబితా ప్రకటన, అమలు.. ఇలా కాలయాపన చేస్తూ చిన్నగా లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేవరకు నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. లోక్సభ షెడ్యూల్ వచ్చేవరకు కాలయాపన చేసి, అ తర్వాత 100 రోజుల్లోనే అమలు చేద్దామని అనుకుంటే, ఇంతలోనే ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్తారు’ అని పేర్కొన్నారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో కాలం వెళ్లదీసే ప్రయత్నం
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఫిబ్రవరి రెండోవారంలోనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తారేమో హరీశ్రావు సందేహం వ్యక్తంచేశారు. ‘బడ్జెట్ పెడితే ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారో స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏయే పథకాలు ఎంతమేరకు అమలు చేస్తారో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల ఎగవేతే అని అర్థం చేసుకోవాలి. వందరోజుల్లో నిజంగానే అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి దానికి స్పష్టమైన జీవోలు ఇచ్చేస్తే ఆన్గోయింగ్ కింద ఆ పథకాలు ఎన్నికల కోడ్ పరిధిలోకి రావు. ఉద్యోగ నోటిఫికేషన్ల తేదీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు. జాబ్ క్యాలెండర్పై మాత్రం ఇప్పటికీ స్పష్టతే లేదు. ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలైతే చేయడం లేదు’ అని విమర్శించారు.
యాసంగిలోనైనా వరికి బోనస్ ఇవ్వాలి
వరి అమ్మొద్దని, డిసెంబర్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.500 బోనస్ ఇచ్చి మరీ కొంటామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ.. కొనలేదని హరీశ్రావు విమర్శించారు. ఇప్పుడు యాసంగి పంట మార్చి, ఏప్రిల్ నెలల్లోనే చేతికి వస్తుందని, యాసంగినైనా బోనస్తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ‘యాసంగి బోనస్పై ఎన్నికల షెడ్యూల్ రాకముందే జీవో ఇవ్వాలి. రైతులకు రూ.500 అదనంగా వస్తే ఎన్నికల కోడ్ వచ్చినా మేం కాంగ్రెస్లాగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపబోము. రూ.500 బోనస్తో వరి కొనుగోలు చేయకపోతే సరిహద్దు జిల్లాల్లోని పంటనంతా పక్క రాష్ర్టాల దళారులు కొనుక్కుని వెళ్లే ప్రమాదం ఉంటది. ఫిబ్రవరి మూడో వారంలోనే వరికి బోనస్పై ఉత్తర్వులివ్వాలి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు 13 క్వింటాళ్లు మాత్రమే కొనేవారు. తెలంగాణలోనైనా రైతులపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకోవాలి. మా ప్రభుత్వంలో ప్రతిరోజూ ఎంత రైతుబంధు వేశామో లెక్కలతో సహా చెప్పేవాళ్లం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. రైతుబంధు ఇంకెప్పుడు పడుతుందని రైతులు ఎదురుచూస్తున్నారు.
శ్వేతపత్రమా? హామీల ఎగవేత పత్రమా?
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చింది శ్వేతపత్రమా? లేకపోతే హామీల ఎగవేత పత్రమా? అని హరీశ్రావు నిలదీశారు. రాష్ట్ర అప్పు రూ.3.90 లక్షల కోట్లని శ్వేతపత్రంలో చెప్పారు. ఈ ఏడాది మార్చి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పులను కూడా కలిపి బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారు. గత నెలలో ప్రభుత్వం రూ.1,400 కోట్లు అప్పు చేసింది. రాబోయే మూడు నెలల్లో రూ.13,000 కోట్లు తీసుకోబోతున్నది. అవన్నీ కూడా కేసీఆర్ సర్కారు ఖాతాలోనే వేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.75 లక్షల కోట్లే. బయటికి మాత్రం రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నదని అసత్య ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోనూ పెట్టారు. కానీ, నిండుసభలో భట్టి విక్రమార్క తమ మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి లేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. లంకెబిందెలు లేవని చెప్పడం దాటవేత, ఎగవేత, కోతల ప్రణాళికల్లో భాగమే. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని లంకెబిందెలు ఇచ్చి వెళ్లింది?’ అని నిలదీశారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా.. ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు అధికారులు ఆహ్వానాలు పంపుతున్నారని మండిపడ్డారు. 119 మంది ఎమ్మెల్యేలను సమాన దృష్టితో చూస్తామని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, కానీ ఇప్పుడేం జరుగుతున్నదని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రొటోకాల్ ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు. ‘వాహనాలను దాచిపెట్టారని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం సరికాదు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన వాహనాలను దాచడం ఉంటుందా? బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవరైనా విజయవాడకు పంపాల్సిందే. వేరే రాష్ర్టాలు సైతం విజయవాడలోనే ఆ పనులు చేయిస్తాయి. కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసి వాహనాలను సీఎం వాడుకోరా? ప్రభుత్వం వాడుకోదా? ప్రగతిభవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని, 150 గదులున్నాయని ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదే భవన్లో ఉంటున్నారు. అవన్నీ ఉన్నాయో లేదో వారే చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని స్పష్టం చేశారు. జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ ఎంతమందికి వచ్చింది?
ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేశామంటూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని హరీశ్రావు మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు ఇచ్చారని, అందులో రెండు హామీలను మాత్రమే అమలు చేశారు తప్ప రెండు గ్యారెంటీలు మొత్తం అమలు చేయలేదని అన్నారు. ఆరోగ్య శ్రీ విషయంలోనూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ‘రాష్ట్రంలో రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ ఇంతవరకు ఎంతమందికి వర్తింపజేశారు. రూ.10 లక్షలు ఏయే జబ్బులకు అనేదానిపై స్పష్టతేలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అవయవ మార్పిడికి రూ.11.50 లక్షలు కూడా ఇచ్చేవాళ్లం. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులన్నీ నాడే తెలుసు. కానీ.. అప్పుడేమో ఆరు గ్యారెంటీలిచ్చి, ఇప్పుడు అప్పులని కొత్త డ్రామాలు ఆడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇండ్ల స్థలాల విషయంలోనూ క్లారిటీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి వరికి బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ, ఆసరా పింఛన్ల పెంపు, 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్తు ఇస్తామని చెప్పారు. కానీ అందులో ఒక్కటీ అమలు చేయలేదు’ అని విమర్శించారు.