చండూరు : స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ వ్యవహారం తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నట్లు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్కసుమన్ విమర్శించారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై బూర చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. మనసులో ఏదో పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
కేసీఆర్ పై మాట్లాడటం అంటే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని అన్నారు. ఆత్మ గౌరవం అంటునే ఢిల్లీలో రెండు రోజులు బీజేపీ నాయకుల అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాసిండని విమర్శించారు. చిలక పలుకులు పలుకుతున్న బూర నర్సయ్య గౌడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
బీసీలకు అన్యాయం జరుగుతుందని అంటున్న ఆయన రాజగోపాల్ రెడ్డి బీసీ మాదిరిగా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధిష్టానం బూర నర్సయ్యగౌడ్కు రెండు సార్లు ఎంపీగా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. కేంద్రంలో బీసీ శాఖ పెట్టకుండా మోసం చేస్తున్న బీజేపీ లోకి వెళ్లి నీతులు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. బలహీన వర్గాలను మోసం చేసేలా బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుని వారికి అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.