ములుగు, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/భువనగిరి కలెక్టరేట్/యాదగిరిగుట్ట: గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు రోడ్డు మార్గాన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహించిన అనంతరం సరస్సును సందర్శించనున్నారు.
అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కోటగుళ్లను సందర్శించి పూజలు చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపురంలోని లక్నవరం సరస్సు వద్దకు చేరుకొని హరిత రిసార్ట్లో ఇతర అధికారులతో కలిసి రాత్రి బస చేయనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు లక్నవరం నుంచి హనుమకొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 29న మధ్యాహ్నం 2.20 గంటలకు ఆలేరు మండలంలోని కొలనుపాక జైన దేవాలయాన్ని, సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు భువనగిరి పట్టణ పరిధిలోని స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు భువనగిరి కలెక్టరేట్లో రచయితలు, కళాకారులు, ప్రముఖులు, రాష్ట్ర జాతీయ అవార్డు గ్రహీతలను కలుస్తారు.