హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశంలో ఇప్పటివరకు ప్రజాస్వామ్యబద్దంగా, హుందాగా జరిగాయని, ఇక ముందు కూడా ఇలాగే జరుగుతాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఎన్నో అంశాలపై సుదీర్ఘంగా, వివరణాత్మకంగా చర్చలు జరిగాయని, అధికార పక్షం కంటే ఎక్కువ సమయం విపక్షాలకు ఇచ్చామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా జరిగిన దాఖలాలు లేవన్నారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాలన్నది రాజ్యాంగంలోనే లేదన్నది తెలుసుకోవాలని విపక్షాలకు చురకలంటించారు.
దేశంలో ఎక్కడా జరుగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించాలని అనుకున్నామని ప్రశాంత్రెడ్డి చెప్పారు. అయితే, సాంకేతిక సమస్య వచ్చినందున రానున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండటం లేదని తెలిపారు. గతంలో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. 1970 లో, 1971 లో, 2013 లో జరిగిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించలేదని వెల్లడించారు. అలాగే, 2003 డిసెంబర్ నెలలో జరిగిన పార్లమెంట్ సంయుక్త సమావేశంలో కూడా రాష్ట్రపతి ప్రసంగం లేదని చెప్పారు. సమావేశాలు ప్రోరోగ్ కానప్పుడు గవర్నర్, రాష్ట్రపతి ప్రసంగాలు లేకుండా చేయడమేంటని దాఖలైన రిట్ను సుప్రీంకోర్టు 2004లో కొట్టేసిందని తెలిపారు.
ఈ విషయాలేవీ తెలియని కొందరు విమర్శలు చేస్తున్నారని ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ప్రోరోగ్ కాని సభకు గవర్నర్ను పిలిస్తే తప్పు అన్నది గమనించాలన్నారు. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాలని రాజ్యాంగంలోనే లేదని చెప్పారు. ప్రతి క్యాలెండర్ ఇయర్లో జరిగే కొత్త సెషన్స్లో గవర్నర్ ప్రసంగించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని, ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో 8 సెషన్స్ జరిగినందున, అవి ప్రోరోగ్ కానందున ఇప్పుడు జరిగే సెషన్ పాత సెషన్కు కొనసాగింపు మాత్రమే అని గుర్తించాలన్నారు. ఇప్పుడు జరిగే బడ్జెట్ సెషన్ కొత్త క్యాలెండర్ ఇయర్లో జరిగే కొత్త సెషన్ కాదని స్పష్టం చేశారు.
రాజ్యాంగం గురించి రాజాసింగ్ మాట్లాడటమా..!?
మహారాష్ట్ర, కర్నాటక, పాండిచ్చేరిలో జరిగిన ఉదంతాలను మరిచి రాష్ట్రంలోని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఒకసారి వాటిని గుర్తుచేసుకుంటే మంచిదని హితవు పలికారు. రాజాసింగ్ రాజ్యాంగం గురించి మాట్లాడటం కన్నా పెద్ద జోక్ లేదని, ఆయనకు సమాధానం ఇచ్చే స్థాయి తనది కాదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం తేలేని ఎంపీ సోయం బాపూరావు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం ఇచ్చింది బోడి రూ.2 కోట్లు.. అదే కేసీఆర్ ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చుచేసిందని తెలిపారు. మహిళలు, గిరిజనుల గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. కేంద్రం నుంచి సమ్మక్క సారక్క జాతరకు పెద్ద మొత్తంలో నిధులు ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు.
రాజ్యాంగం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెక్కలేదని మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. రాజ్యాంగబద్దంగా ఏర్పడిన తెలంగాణ పుట్టుకను పార్లమెంట్లోనే ప్రశ్నించిన ప్రధాని మోదీకి రాజ్యాంగంపై ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్న సంజయ్కు కౌంట్డౌన్ మొదలైందని హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న బీజేపీ నేతలను మంత్రి హరీష్రావుకు చెప్పి పిచ్చాసుపత్రికి పంపిస్తామన్నారు.