హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మపై గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చిన్నచూపు చూశారు. ఓ ఆలయ సందర్శనకు వచ్చిన గవర్నర్ను స్థానిక మహిళలు బతుకమ్మ ఆడాలని కోరగా, తాను ఆడనంటూ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో అధికారులు శుక్రవారం బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆలయానికి వచ్చారు.
ఆలయ గర్భగుడిలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా గవర్నర్ తమిళిసై అక్కడికి చేరుకొన్నారు. ప్రధాన ద్వారం గుండా గర్భాలయంలోకి వెళ్లి పూజలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కవిత.. గవర్నర్తో కాసేపు ముచ్చటించారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలి అని అక్కడున్న మహిళలు గవర్నర్ను కోరగా.. ‘నేను వెళ్లాలి’ అంటూ బతుకమ్మ ఆడకుండానే వెనుకగేటు నుంచి వెళ్లిపోయారు. ఆలయాల సందర్శనకు అడ్డురాని ప్రొటోకాల్ బతుకమ్మ ఆడితే వస్తుందా? అంటూ గవర్నర్ తీరుపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. కాగా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గవర్నర్ నేరుగా అమ్మవల్లి సీతారామచంద్రస్వామి ఆలయానికి రావడంతో అధికారులు అవాక్కయ్యారు.