మహబూబాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలను సీఎం కేసీఆర్ గుర్తించి, వా రిని ప్రభుత్వంలో విలీనం చేసేందు కు ప్రయత్నిస్తుంటే గవర్నర్ అడ్డుకోవాలని చూడటం సరికాదని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి బీజేపీ కార్యకర్తగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆమె పే ర్కొన్నారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించే ప్రతి బిల్లును ఏదో వంకతో తిరస్కరించడం, వెనక్కి పంపడమే పనిగా పెట్టుకోవడం సరికాదని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును అడ్డుకునే ప్రయత్నాలను గవర్నర్ తమిళిసై మానుకొని, వెంటనే ఆమోదం తెలుపాలని విజ్ఞప్తి చేశారు. దేశమే నివ్వెరపోయే విధంగా మణిపూర్లో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలపై పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.