Tamilisai | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ శుక్రవారం సచివాలయానికి రానున్నారు. గురువారం రాజ్భవన్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి మంత్రిగా ప్రమాణం సందర్భంగా సీఎం కేసీఆర్కు, గవర్నర్కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది.
‘కొత్త సచివాలయం అద్భుతంగా ఉన్నది. ఈ మధ్య కొత్త సచివాలయం ముందు నుంచి వెళ్తున్నప్పుడు చూశాను. బాగుంద’ని గవర్నర్ అనగా, ‘హైదరాబాద్ గంగాజమునా తెహజీబ్కు ప్రతీకగా సచివాలయ ప్రాంగణంలో ఆలయం, మసీదు, చర్చి నిర్మించాం. శుక్రవారం పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 12 గంటలకు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రావాల’ని సీఎం ఆహ్వానించినట్టు సమాచారం. తప్పకుండా వస్తానని గవర్నర్ పేర్కొన్నట్టు తెలిసింది. ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరవుతారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.