రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు అనుమతివ్వని గవర్నర్!
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ మేరకు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నదా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నది. ఇందులో ఎఫ్ఆర్బీఎం పరిమితి, కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటాపై స్పష్టత రానున్నది. ఆ వెంటనే రాష్ట్ర బడ్జెట్ను శాసనసభకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో పెట్టేందుకు గవర్నర్ అనుమతి అవసరం. ఈ మేరకు బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ను పలుమార్లు సంప్రదించినట్టు తెలిసింది. దీనికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుంచి సానుకూల స్పందన రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి స్వయంగా గవర్నర్ను కలిసి అసెంబ్లీలో బడ్జెట్ సమర్పణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించినట్టు తెలిసింది. అయినా ఇప్పటికీ అనుమతి రాలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ జమాఖర్చుల పద్దులకు ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే అసెంబ్లీ అనుమతి తీసుకోవడం రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ఆమోదించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయిన గవర్నర్పై ఉంటుందని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. బడ్జెట్ సమర్పణకు గవర్నర్ ఆమోదం తెలిపితే..
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులను రూపొందించుకోవడం, క్యాబినెట్ సమావేశమై చర్చించి, ఆమోదించుకోవడం.. బడ్జెట్ పద్దులను ముద్రించడం తదితర కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అయితే.. గవర్నర్ నుంచి ఇప్పటివరకు అనుమతి రాని నేపథ్యంలో రాజ్యాంగపరమైన సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. అందుకే రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు గవర్నర్ ఆమోదం కోసం హైకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.