హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత నిబద్ధత, నిరంతర శ్రమ, నిస్వార్థసేవ, పరస్పర సహకారాల ద్వారా ప్రగతిశీల సుసంపన్న తెలంగాణ రాష్ర్టాన్ని నిర్మించడానికి సంకల్పిద్దామని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గి అన్ని రంగాల్లో స్వావలంబన సాధించిన భారతదేశంగా నిర్మించుకోడానికి సంకల్పించాలని కోరారు. మంగళవారం రాజ్భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ ధనం, ఆరోగ్యం, సంతోషాలు చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఈ క్రోధి నామ సంవత్సరంలో కొంత క్రోధం ఉన్నప్పటికీ, ఇది అందరికీ సానుకూలంగా, శ్రేయోదాయకంగా ఉంటుందని పంచాంగకర్తలు చెప్పడం ముదావహం అని పేర్కొన్నారు. గత సంవత్సరం మనం చేసిన పనులను సమీక్షించుకొని మరింత నిబద్ధత, అంకితభావం, కృషి, ఉన్నతమైన ఆలోచనలు, సేవాభావంతో మన పనితీరును మరింత మెరుగ్గా మలచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా పాల్గొన్నారు.