మహబూబాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా ఆదాయాన్ని మరింత పెంపొందించుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని బయ్యారం పెద్ద చెరువులో జిల్లా కలెక్టర్ కె. శశాంకతో కలిసి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి చెరువులో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందన్నారు.
2021-22 సంవత్సరంలో జిల్లాలో 4.95 కోట్ల విలువ గల 4.348 కోట్ల చేప పిల్లలను 1264 చెరువులలో వేశామన్నారు. దీంతో 15272 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ద్వారా రూ.196 కోట్ల ఆదాయం మత్స్య కారులకు లభించిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని చెరువులను మిషన్ కాకతీయ ద్వారా ఆధునీకరించుకోవడం వల్ల నేడు జలాశాయాలన్ని అలుగు పారుతున్నాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనతో సాధ్యమైందన్నారు.
మత్స్యకార సంఘాలలో సభ్యత్వం కోరే వారికి అవకాశం కల్పించి స్థానిక సొసైటీలు తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పోడు భూములకు సంబంధించి ఏ ఒక్క రైతు నష్టపోకుండా న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ హరిసింగ్ నాయక్, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి , కోటగడ్డ సర్పంచులు కోటమ్మ, వెంకన్న, జిల్లా మత్స్య శాఖాధికారి ఏ. నాగమణి పాల్గొన్నారు.