వనపర్తి : దేశంలో మరెక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు . వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 176 మందికి రూ.1,76,20,416 విలువైన కల్యాణలక్ష్మి, 141 మందికి రూ.40.26 లక్షల విలువైన షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తున్నారని వెల్లడించారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల మరమ్మతు జరిగిందన్నారు.ఆరోగ్య రంగంలో కేసీఆర్ కిట్, అమ్మఒడి, నూతన ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ఉచిత ఆరోగ్య పరీక్షా కేంద్రాలు, కొత్తగా 100 డయాలసిస్ కేంద్రాలు, నూతన మెడికల్ కళాశాలలు, నర్సింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటు జరిగిందన్నారు.
సంక్షేమరంగంలో ఆసరా ఫించన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , దళితబంధు, రూ.5 అన్నపూర్ణ క్యాంటీన్లు వంటి పథకాలు పేదలకుఎంతగానో ఉపయోగపడుతున్నాయని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు.