హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారంనాడు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిరిసిల్ల నేత కార్మికులతో దాదాపు 1.20 జాతీయ పతాకాలను సిద్ధం చేయించింది. వాటిని రాష్ట్ర నలుమూలలకు సరఫరా చేసింది. మంగళవారం అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సంబంధిత కమిషనర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ జెండాలను పంపిణీ చేయనున్నారు. పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, జీపీ సిబ్బంది ఆధ్వర్యంలో జెండాల పంపిణీ 14వ తేదీ వరకు కొనసాగనున్నది. తరువాత 15న ఇంటింటా జాతీయ పతకాలను ఆవిష్కరించనున్నారు.
550 థియేటర్లలో గాంధీ చిత్ర ప్రదర్శన
వజ్రోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ ఔన్నత్యాన్ని, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని యువతలో రగిలించేందుకు మంగళవారం నుంచి 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 550 థియేటర్లలో గాంధీ చిత్ర ప్రదర్శన కొనసాగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రోజూ ఉదయం 10 గంటల నుంచి 1.15 గంటల వరకు ఈ ఉచిత షోను ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శిస్తారని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు. హైదరాబాద్లో తెలుగు/హిందీలో చిత్రాన్ని ప్రదర్శిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా తెలుగులో ప్రదర్శిస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తప్పకుండా చిత్రాన్ని చూపించాలని సూచించారు. విద్యార్థులను థియేటర్లను తరలించేందుకు ప్రభుత్వమే ఉచితంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల యజమానులు సంబంధిత జిల్లా ఎడ్యుకేషన్ అధికారులను సంప్రదించాలని, వారు ట్రాన్స్పోర్టు అధికారుల సహకారంతో అన్నీ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. సెలవు దినాల నేపథ్యంలో 12,13,14,15 తేదీల్లో చిత్ర ప్రదర్శన ఉండదని వెల్లడించారు.