విద్యానగర్, జనవరి 7: కామారెడ్డి మాస్టర్ప్లాన్ ముసాయిదాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. 2000 సంవత్సరంలోనూ మాస్టర్ప్లాన్ రూపొందించామని, అప్పుడు ఏ ఒక్క రైతు భూమి కూడా పోలేదని గుర్తుచేశారు. ప్రస్తుత బృహత్ ప్రణాళిక ముసాయిదా వల్ల కూడా ఏ రైతుకూ అన్యా యం జరగదని స్పష్టం చేశారు. మాస్టర్ప్లాన్ భవిష్యత్తులో పట్టణ అభివృద్ధికేనని స్పష్టం చేశారు.
శనివారం కామారెడ్డిలో గంప మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 7 గ్రామాలు విలీనం కావడంతో పట్టణ విస్తీర్ణం పెరిగిందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాల దృష్ట్యా మాస్టర్ప్లాన్ డ్రాఫ్ట్ను తయారు చేశామని తెలిపారు. 2000 సంవత్సరంలో మాస్టర్ప్లాన్ను రూ పొందించామని, 20 సంవత్సరాలకోసారి బృహత్ ప్రణాళికను తయారు చేస్తారని చెప్పా రు. వాస్తవానికి 2020లో డ్రాఫ్ట్ రూపొందించాల్సి ఉండగా, కరోనా కారణంగా రెండేండ్లు ఆలస్యమైనదని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 14 మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్ల డ్రాఫ్ట్లు ప్రభుత్వానికి అందాయని, అందులో కామారెడ్డి మున్సిపాలిటీ కూడా ఉన్నదని చెప్పారు. ముసాయిదా ప్రవేశపెట్టిన తర్వాత అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలుపాలని పేపర్లలో ప్రకటనలు ఇచ్చామని, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ప్రతిపక్ష నాయకులు కొందరు కావాలనే రైతులను రెచ్చగొడుతూ వారిలో అపోహలు, భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది ముసాయిదా మాత్రమేనని, తుది నిర్ణయం కాదన్న విషయం అందరికీ తెలుసన్నారు.