హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)/ధర్మారం, మే 2: వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీకి సీఎం కేసీఆర్ ప్రణాళికను రూపొందించారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండంలోని పలు గ్రామాల్లో మంగళవారం మంత్రి విస్తృతంగా పర్యటించారు. ధర్మారంలో ‘మన ఊరు -మన బడి’ కింద ఎంపికైన ప్రాథమిక పాఠశాలలో రూ.27.50 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కటికెనపల్లిలో రూ.1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా కటికెనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ నెల 20లోగా కొత్త పింఛన్ అర్హుల జాబితా ఖరారు అవుతుందని చెప్పారు. వచ్చే నెల నుంచి పింఛన్ల పంపిణీ జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. గతంలో స్వయం సహాయక గ్రూపు మహిళలు అభయ హస్తం కోసం పొదుపు చేసిన డబ్బులు తిరిగి వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని వెల్లడించారు. అటు.. ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారని వివరించారు. తెలంగాణ సుభిక్షంగా వర్థిల్లాలంటూ అల్లాను ప్రార్థించాలని సూచించారు.