వరంగల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల ఆరోగ్యం, పేదల వైద్యసేవల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరిస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసిందని తెలిపారు. కరోనా బారినపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని, వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్ వార్డును మంత్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులతో మాట్లాడి సేవలు అందుతున్న తీరును, వసతుల గురించి అడిగి తెలుసుకొని, మనోధైర్యం కల్పించారు. కొవిడ్ కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువున్న వారికి మెరుగైన వైద్యసాయం చేయాలని డాక్టర్లను కోరారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు ఉన్నాయని, ప్రజలు లేనిపోని అనుమానాలతో ప్రైవేట్కు వెళ్లొద్దని విజ్ఞప్తిచేశారు. ఎంజీఎంలో 800 బెడ్స్తో కరోనా వైద్య సేవలు అందిస్తున్నామని, 650 బెడ్స్కు ఆక్సిజన్ అందుబాటులో ఉందని వివరించారు. ఎంజీఎంలోని కరోనా బాధితులకు అవసరం మేరకు రెమ్డిసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ సరఫరా తీరు బాగుందని, ఏ రోజూ ఇబ్బంది లేకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ను ఫోన్లో కో రారు. ఎంజీఎంకు అవసరమైన మేరకు రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు సరఫరా చేయాలని హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథిరెడ్డిని ఫోన్లో కోరారు. ఎంజీఎంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, సానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందిని మంత్రి అభినందించారు.