హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో సిర్పూర్ కాగజ్నగర్ కాలేజీ విద్యార్థి జెల్ల అమన్ 990 మార్కులు సాధించాడు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ హసన్పర్తి (హనుమకొండ జిల్లా) విద్యార్థిని కొర్ర మేఘనాసింధు సీఈసీలో వెయ్యి మార్కులకు 990 మార్కులు సాధించింది. ఆర్సీపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు విష్ణుప్రియ బైపీసీలో 979, పీ సంజన ఎంపీసీలో 954 మార్కులు సాధించారు.
‘మాడల్’ విద్యార్థుల ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మాడల్ స్కూల్స్ సొసైటీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాడల్ స్కూల్ విద్యార్థి సుగమ్య, నందిపేట మాడల్ స్కూల్ విద్యార్థి పీ నిత్యూష ఎంపీసీలో 466 మార్కులు సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెగుళ్లపల్లి మాడల్ స్కూల్ విద్యార్థులు మంజుల, అనూషలు బైపీసీలో 434, కరీంనగర్ జిల్లా రామడుగు మాడల్ స్కూల్ విద్యార్థి వర్షారెడ్డి బీపీసీలో 434, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాడల్ స్కూల్ విద్యార్థి జే జానకి సీఈసీలో 488 మార్కులను సాధించారు. సెకండియర్లో సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ మాడల్ స్కూల్ విద్యార్థి ఆడం ప్రీతి సీఈసీలో 985 మార్కులతో సత్తాచాటారు.
టీఆర్ఈ సొసైటీలో 95.68 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీల్లో 95.68 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు సొసైటీ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. ఫస్టియర్లో 2,678 విద్యార్థులకు 2,534, సెకండియర్లో 2,742 మందికి 2,674 మంది పాసైనట్టు పేర్కొన్నారు. ఎంపీసీ సెకండియర్లో ఎన్ మౌనిక 986, బైపీసీలో బీ నిరోష 988, ఎంఈసీలో జీ స్వాతిక 977, ఫస్టియర్ ఎంపీసీలో జీ కావ్య 467, బైపీసీలో పీ వైష్ణవి, సోనికుమారీ 436, ఎంఈసీలో పీ అరుణ 488 మార్కులు సాధించినట్టు వెల్లడించారు.
సంస్కృతంలో సున్నా
ఇంటర్ ఫలితాల్లో ఓ విద్యార్థికి సున్నా మార్కులు వచ్చాయి. ఎంపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థి ఫస్టియర్లో అన్నింట్లో పాస్కాగా, సెకండియర్లో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యి, ఒక్క సంస్కృతంలోనే ఫెయిల్ అయ్యాడు.