హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): అడవిబిడ్డల ఆరోగ్యరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొంటున్నది. అటవీ ప్రాంతాల్లో విసిరేసినట్టు జీవనం సాగించే నాలుగు ఆదిమ గిరిజన తెగలను కంటికి రెప్పలా చూసుకోవాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జ్వర సర్వేను అటవీ ప్రాంతాల్లోనూ నిర్వహిస్తూ అవసరమైన మందులు, నిత్యావసరాలు, పోషకాహారాన్ని ఐటీడీఏల ద్వారా అందిస్తున్నది. ఉట్నూరు, భద్రాచలం, మన్ననూర్ ఐటీడీఏల పరిధిలోని కొలామ్, థోటీ, చెంచు, కొండరెడ్డి పీవీటీజీ (పర్టిక్యులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్)లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. ఈ తెగల జనాభా 10 జిల్లాల్లో 68 మండలాల పరిధిలోని 533 ఆవాసాల్లో దాదాపు 90వేల వరకు ఉన్నది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న కిరాణా దుకాణాలకు అదనంగా మొబైల్స్టోర్లు, కూరగాయల మార్కెట్లను ఏర్పాటుచేసి, నిత్యావసరాలను ప్రభుత్వమే పంపిణీ చేస్తున్నది. వంటనూనె, పంచదార, ఉప్పు, టీపొడి, ఉల్లిగడ్డలు, సబ్బులు, బిస్కెట్లు సహా 18 రకాల నిత్యావసర సరుకుల కిట్లను అందజేస్తున్నది. రక్తహీనత నివారణకుగాను గర్భిణులకు అంగన్వాడీల ద్వారా కిలో ఇప్పు లడ్డూ ఇస్తున్నది. ఆయా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తక్షణం స్పందించేవ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, క్షణాల్లో సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏలను ఆదేశించింది. మరోవైపు జ్వర సర్వేలోనూ ఈ నాలుగు పీవీటీజీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది.