హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నది. నిధుల కొరత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకొంటున్నది. 2023-24 బడ్జెట్లో యూనివర్సిటీలకు రూ.500 కోట్లు కేటాయించడం ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పద్దులో సింహభాగం చిన్న వర్సిటీలకే కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. హాస్టళ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం పలు వర్సిటీలు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేయగా ఈ మొత్తాన్ని కేటాయించింది.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సర్కారు నల్లగొండలో మహత్మాగాంధీ, మహబూబ్నగర్లో పాలమూరు, నిజామాబాద్లో తెలంగాణ, కరీంనగర్లో శాతవాహన వర్సిటీలను ఏర్పాటు చేసింది. చిన్న చిన్న భవనాలు నిర్మించి మౌలిక వసతులను విస్మరించింది. అప్పటి ప్రభుత్వాలు బ్లాక్గ్రాంట్ మినహా పెద్దగా నిధులిచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ బీఆర్ఎస్ సర్కారు తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. బ్లాక్గ్రాంట్కు అదనంగా ఈ నిధులను పొందుపరిచింది. నిధుల కేటాయింపు నేపథ్యంలో అధికారులు ఇటీవల వర్సిటీల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
ఏటా విద్యుత్తు బిల్లులు భారంగా మారుతుండటంతో పలు వర్సిటీలు సోలార్ను ఎంచుకొంటున్నాయి. ఇప్పటికే జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్లో 4 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ను నెలకొల్పారు. ఫలితంగా విద్యుత్తు బిల్లు భారీగా తగ్గిపోయింది. మహత్మాగాంధీ వర్సిటీలోను 60 కిలోవాట్స్ విద్యుత్తు ప్లాంట్ వినియోగంలో ఉండగా, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పలు వర్సిటీలు సైతం రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.