హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మిజ్గాం తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన ఏపీ రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ ఆ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చేతికొచ్చి న ధాన్యం, అరటి, జొన్న పంటలు నీట మునిగి వేలాది ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి నిబంధనలు లేకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. పూర్తిగా జలమయమైన లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.