ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అదో మారుమూల గ్రామం. పంచాయతీగా ఏర్పడి కేవలం నాలుగేండ్లే అయ్యింది. కానీ, ఇప్పటివరకు రూ.33 కోట్ల విలువైన ప్రభుత్వ పథకాలు ఆ గ్రామంలో అమలయ్యాయి. ఆ గ్రామం మరేదో కాదు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే). గ్రామంలో 202 కుటుంబాలు ఉండగా.. ఒక్కో ఇంట్లో కనిష్ఠంగా మూడు, గరిష్ఠంగా ఆరు పథకాలతో లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల గ్రామస్థుల ఉపాధి మెరుగుపడింది. సర్కారు అందిస్తున్న సాయంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గ్రామస్థులు తమకు అందుతున్న పథకాల వివరాలు తెలియజేస్తూ వారి ఇండ్ల ఎదుటు ఫ్లెక్సీలు పెట్టుకొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని మేలు తెలంగాణ ప్రభుత్వం చేసిందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
సర్కారు సాయం మరువలేం
గతంలో ఎప్పుడూ లేని విధంగా మా గ్రామంలో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. నాకు ప్రభుత్వం రూ.15 లక్షలతో మూడెకరాల భూమి, దళిత అభివృద్ధిశాఖ నుంచి రూ.1.50 లక్షలతో బోర్, కరెంటు మోటర్ ఇచ్చారు. మా తండ్రి కేశవ్కు వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. కేసీఆర్ సర్కారు చేస్తున్న సాయం మేము మరువలేం.
–కస్బే విష్ణు, ముక్రా(కే), ఇచ్చోడ మండలం