హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సర్పంచ్లకు 5 నెలలుగా నిలిచిపోయిన వేతనాల బడ్జెట్ను ప్రభుత్వం విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్పంచ్లు ఎదురొంటున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించి ఈ నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామాలు ఉండగా, 12,702 గ్రామాల్లో కొత్తగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. నిరుడు డిసెంబర్ 22న సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.6,500 గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉన్నది. కానీ, బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మే వరకు ఐదు నెలలుగా ఒక్కొక్కరికి రూ.32,500 ప్రభుత్వం బకాయి పడింది. మొత్తం రూ.41.28 కోట్లు రావాల్సి ఉన్నది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేతనాలు అందక సర్పంచ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని ‘నమస్తే తెలంగాణ’ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వార్తపై ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్శాఖ స్పందించింది. సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించి, బడ్జెట్ను విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో సర్పంచ్ల ఖాతాల్లో నిధులు నేరుగా జమకానున్నట్టు అధికారులు తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిధుల విడుదలకు సహకరించిన ‘నమస్తే తెలంగాణ’కు సర్పంచ్లు కృతజ్ఞతలు తెలిపారు.