న్యూఢిల్లీ : కరోనావైరస్ బారినపడి స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి సీటీ స్కాన్ అవసరం లేదన్న ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియ తాజాగా బయో మార్కర్లు, స్టెరాయిడ్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బయోమార్కర్లను గుర్తించేందుకు నిర్వహించే సీఆర్పీ, డీ-డైమర్ వంటి పరీక్షలను కరోనా వైరస్ సోకి తీవ్ర, మధ్యస్థ లక్షణాలతో బాధపడేవారు చేయించుకోవాలని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సాధారణంగా ఉన్నవారు, లక్షణాలు లేనివారికి ఈ రక్త పరీక్షలు అవసరం లేదని చెప్పారు.
దంతాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ పరీక్షలో ఇన్ఫెక్షన్ తీవ్రతను చూపుతాయని, అవసరం లేకుండా బయోమార్కర్లపై ఆధారపడి చికిత్స అందిస్తే అవి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుల సూచనతోనే బయోమార్కర్లను నిర్వహించాలన్నారు. ఇక కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడేవారికి తొలి రోజు నుంచే స్టెరాయిడ్లు ఇస్తే న్యుమోనియాకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.తీవ్ర, మద్యస్ధ లక్షణాలున్న వారికే స్టెరాయిడ్లు ఇవ్వాలని అన్నారు. కరోనా చికిత్సా విధానంలో ఆక్సిజన్ థెరఫీ, స్టెరాయిడ్లు, యాంటీ కాగ్యులెంట్స్ ప్రామాణిక చికిత్సగా డాక్టర్ గులేరియ వివరించారు.