హైదరాబాద్ : అంతరించిపోతున్న గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గొప్ప కృషి జరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఎక్కడో మారుమూల ప్రాంతంలో మేడారం జాతరలో సమ్మక్క – సారలమ్మల చరిత్రను డోలి వాయిద్యంలో చెప్పే రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించడం ఈ ప్రభుత్వానికి ఆదివాసీ కళల పట్ల ఉన్న చిత్తశుద్ది, అంకితభావానికి నిదర్శనమన్నారు.
గత ఏడాది గుస్సాడి కనకరాజును, ఈ ఏడాది రామచంద్రయ్యలను పద్మశ్రీలకు ప్రతిపాదించడం ద్వారా గిరిజన కళల గొప్పతనాన్ని, ఆవశ్యకతను చాటి చెప్పారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ, కోయ జాతి ఆణిముత్యం, జానపద కళాకారులు, డోలి వాయిద్య కారులు పద్మశ్రీ రామచంద్రయ్యను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, విప్ రేగా కాంతారావు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అధికారులు కలిసి సోమవారం మాసబ్ టాంక్ లోని నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియంలో ఘనంగా సత్కరించారు.
ఆయనకు పట్టుబట్టలు పెట్టి, శాలువా కప్పి, లక్ష రూపాయల నగదు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈరోజు సుదినం అన్నారు. ఆదివాసీ కోయ బిడ్డ ఎక్కడో పుట్టి, కళకు గొప్ప సేవ చేసి భారత పురస్కారం పద్మశ్రీ పొందారు.
కోయ చరిత్రలు చెబుతూ తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పద్మ పురస్కారాలకు సిఫారసు చేయడం ఈ కళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
ఈ రెండు సంవత్సరాలలో మా గిరిజనులకు గొప్ప గౌరవం దక్కింది. గత ఏడాది గుస్సాడి కనకరాజుకి, ఈ ఏడాది డోలి రామచంద్రయ్యకు పద్మశ్రీలు లభించాయి. గిరిజనుల కళల గొప్ప తనానికి ఇవి నిదర్శనమని పేర్కొన్నారు.
మేడారం జాతరలో డోలి కళను ప్రదర్శించడం, అమ్మవార్ల చరిత్రను, ఔన్నత్యాన్ని చెప్పడం, తద్వారా ఈ కళను, చరిత్రను భావి తరాలకు తీసుకెళ్లే ప్రయత్నం రామచంద్రయ్య నిరంతరం చేశారని ప్రశంంసించారు.
గిరిజన సంస్కృతి, కళలు అంతరించకుండా గిరిజన సంక్షేమ శాఖ ఎనలేని కృషి చేస్తోందన్నారు. పద్మశ్రీ రామచంద్రయ్య కుటుంబానికి వారి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇల్లు, వారి పిల్లలను గిరిజన శాఖ ద్వారా సముచితంగా ఆదుకుంటామన్నారు.