హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను ప్రభుత్వం రెండేండ్లుగా చెల్లించడం లేదని, దీంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం నిధులను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన చిన్నారులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించేందుకు ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకాన్ని అమలు చేస్తున్నారు. 17 ఏండ్ల నుంచి ఈ పథకం రాష్ట్రంలో అమలవుతున్నది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ద్వారా ఎంపికైన విద్యార్థులను అదే జిల్లా పరిధిలోని ప్రైవేట్ స్కూళ్లల్లో చదివిస్తారు. వీరికి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది.
షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు 1, 5వ తరగతిలో, గిరిజన విద్యార్థులకు 1, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎంపికైన ప్రాథమిక తరగతి విద్యార్థికి ఏడాదికి రూ.28,000, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు(వసతితో కలిపి) రూ.42,000 చెల్లిస్తున్నారు. ప్రాథమికోన్నత విద్యార్థి వసతి గృహంలో ఉండటానికి ఇష్టపడకపోతే అతడికి ఫీజుగా రూ.28 వేలు చెల్లిస్తున్నారు. గిరిజన విభాగంలోనూ ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు.
ఒకసారి ప్రవేశం పొందితే.. పదో తరగతి వరకు ప్రభుత్వమే ఫీజు చెల్లించడంతోపాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ డ్రెస్ వంటి వాటిని సైతం ఉచితంగా అందిస్తుంది. అడ్మిషన్ పొందిన పాఠశాలల్లోని ఫీజులను ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ద్వారా రీయింబర్స్చేస్తారు. ఈ స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేట్ పాఠశాలల్లో 26వేల మంది విద్యార్థులు ఉచితంగా విద్య పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 22 నెలలుగా ఈ స్కీమ్కు సంబంధించి రూ.220కోట్ల నిధులు బకాయి పెట్టింది. ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి.
పాఠశాలలు నడపలేమని, విద్యార్థులను స్కీం కింద చేర్చుకోబోమని తెగేసి చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.