హైదరాబాద్ : జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్లో జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల కిక్కిరిసిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 26, 2016న జీవో16ను జారీ చేశారని వినోద్ కుమార్ తెలిపారు.
కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం కొలిక్కి రాకుండాపోయిందన్నారు. ఇటీవల కాలంలో కేసును కోర్టు కొట్టివేసిందని, ఆ తర్వాత ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసిందని తెలిపారు. అయితే, కింది కోర్టులో కేసు ఓడిన వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయం కోసం పలు సూచనలు, సలహాలను కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి వినోద్కుమార్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ పలుమార్లు ప్రశంసించిందని వినోద్కుమార్ గుర్తు చేశారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తుండడం, నీటి పారుదల సౌకర్యాలు పెంచడం, సంక్షేమ, అభవృద్ధి కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టడం వంటి అనేక అంశాలు ఉన్నాయని వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్రను పోషిస్తున్నదన్నారు.
ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మరో 90వేల ఉద్యోగాల భర్తీ కోసం దశల వారీగా నోటిఫికేషన్స్ జారీ చేస్తోందని వివరించారు. ఒకేసారి నోటిఫికేషన్స్ జారీ చేస్తే అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచం మెచ్చుకునే రీతిలో నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా పలు ప్రాజక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్షలాది ఎకరాల భూములకు సాగు నీరు చేరుతుందని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీనిచ్చారు. సమావేశంలో లెక్చరర్స్ సంఘాల నాయకులు రామకృష్ణ గౌడ్, జంగయ్య, రమణా రెడ్డి, సురేశ్, శ్రీనివాస్, వైకుంఠం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.