మెదక్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కులస్తుల సంక్షేమానికి ప్రాధా న్యతనిస్తుందని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి(MLA Padmadevender Reddy) అన్నారు. బుధవారం మెదక్లోని మాయ గార్డెన్లో ఎరుకల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సమావేశానికి పద్మా దేవేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను విస్మరించాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు. ఎరుకల కులస్తులకు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పందుల పెంపకానికి నిధులను కేటాయించిందని, కులస్తులు సొసైటీగా ఏర్పడి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ ఫలాలు అందరికి అందుతాయని, మరోసారి ఆడబిడ్డగా ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.