హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): అద్భుతమైన మౌలిక వసతులతో తయారీ రంగానికి హైదరాబాద్ నెలవుగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడిదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో విధేయతతో ఉంటుందని తెలిపారు. తెలంగాణలో తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేవారికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్నో ఎన్క్లేవ్లో జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యాపార విస్తరణతోపాటు తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన జాన్సన్ కంట్రోల్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో టాలెంట్కు కొదవ లేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం ప్రత్యేకంగా పలు పాలసీలను తీసుకువచ్చిందని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పెట్టుబడులకు ఏకైక గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని, ఇకపై దేశంలో ఏ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణలకు టీ-హబ్ కేంద్రంగా మారిందని, అదే స్థాయిలో టీ-వర్స్, ఇమేజ్ టవర్ లాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు భద్రతాపరమైన సేవలు అందించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణలో ఉత్పత్తుల నాణ్యత చాలా బాగుంటుందని జాన్సన్ కంట్రోల్స్ గ్లోబల్ సెక్యూరిటీ ప్రొడక్స్ విభాగం అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ డేవ్ పుల్లింగ్ అన్నారు. అందుకే తమ ఉత్పత్తుల తయారీకి హైదరారాబాద్ను ఉత్తమ ప్రదేశంగా గుర్తించామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎంపీ రంజిత్రెడ్డి, జాన్సన్ కంట్రోల్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ శంకరన్, ఆ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
135 ఏండ్ల చరిత్ర.. 150 దేశాల్లో కస్టమర్లు
అమెరికన్-ఐరిష్ బహుళజాతి సంస్థ అయిన జాన్సన్ కంట్రోల్స్కు 135 ఏండ్ల ఘన చరిత్ర ఉన్నది. దాదాపు 150 దేశాల్లో కస్టమర్లను కలిగివున్న ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికిపైగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ హైదరాబాద్లో తొలుత 500 మంది ఇంజినీర్లతో సేవలను ప్రారంభిస్తున్నది. ఇందుకోసం హైటెక్ సిటీలోని గౌరా ఫౌంటెయిన్ హెడ్ భవనంలో 41వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. అసెంచర్ ఐటీ సంస్థతో కలిసి ఈ కేంద్రంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. వాటితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), 5జీ లాంటి అత్యాధునిక సాంకేతికతల ఆధారంగా కస్టమర్లకు సేవలను అందిస్తున్నది.