Dharani | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ధరణిలో కొత్త మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి బదలాయించుకునేందుకు ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్సేంజ్’ పేరుతో అవకాశాన్ని కల్పించింది. టీఎం-35 కింద ఈ మాడ్యూల్ను ప్రవేశపెట్టింది. ఈ మాడ్యూల్తో అనేక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ఒకే డీడ్తో ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి బదలాయించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబానికి రెండు చోట్ల భూములుంటే.. అన్నదమ్ముల మధ్య పంపకాల సమయంలో రెండు చోట్ల సగం చొప్పున తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు.
ఎవరైనా అవసరం ఉండి భూమి అమ్మకానికి ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటివారు ఒకేసారి పరస్పరం తమ భూములను బదలాయించుకునేందుకు కొత్త డీడ్తో అవకాశం కలిగింది. కొన్ని సందర్భాల్లో రైతులు రోడ్డు కోసమో, వాస్తు కోసమో, ఇతర అవసరాల కోసమో కొంత భూమిని పరస్పరం బదలాయించుకుంటారు. సాధారణ సందర్భాల్లో ఇద్దరు సేల్ డీడ్ చేసుకొని హక్కులు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మాడ్యూల్తో ఇద్దరు కలిసి ఎక్సేంజ్ డీడ్తో హక్కులు మార్పిడి చేసుకునే చాన్స్ కలుగుతుంది.