TS TET | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నిరుద్యోగుల నడ్డి విరుస్తూ టెట్ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచేసింది. ఒక్కో పేపర్కు ఫీజును రూ.వెయ్యిగా నిర్ధారించింది. రెండు పేపర్లు రాయాలంటే రూ.2 వేలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు schoo ledu.telangana. gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. టెట్ను మే 20 నుంచి జూన్ 3 వరకు 15 రోజులపాటు ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ టెట్కు హాజర య్యే వెసులుబాటు కల్పిస్తున్నది. డీఈడీ పూర్తి చేసినవారు మాత్రమే టెట్ పేపర్-1కు అర్హులు. పేపర్-2కు డిగ్రీ బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు అయితే జనరల్కు 50%, ఇతరులకు 40% ఉన్నవారు కూడా అర్హులే.
ఊరట కల్పిస్తామని.. ఫీజు బాదుడు
నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూ లు చేయకుండానే పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పుడు భారీగా ఫీజు పెంచింది. టెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేయటం ఇదే తొలిసారి. టెట్ ప్రారంభంలో రూ.200 మాత్రమే వసూలు చేశారు. ఆ తర్వాత రూ.300కు పెరిగింది. గత ఏడాది ప్రభుత్వం నిర్వహించిన టెట్కు రూ.400 ఫీజు వసూలు చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా రెండున్నర రెట్లు పెంచడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గించకపోతే ఉద్యమం
కాంగ్రెస్ అధికారంలో వస్తే పరీక్ష ఫీజులు ఉండవు అని చెప్పి, ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ఒక్కో పేపర్కు రూ.వెయ్యి వసూలు చేయటం దారుణం. ఇది 4 లక్షల మంది అభ్యర్థులను మోసం చేయడమే. వెంటనే ఫీజు తగ్గించాలి. లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తాం. టెట్ ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలి.
– రావుల రామ్మోహన్రెడ్డి, రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు