నల్లగొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ అన్నారు. గురువారం జిల్లాలోని మర్రిగూడ(మాల్) లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన గ్రామ భారతి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలను గవర్నర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు దినోత్సవం సందర్భంగా మర్రిగూడ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపొందించేందుకు హరిత హారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.
కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించి, పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. పండుగల్లో కరోనా జాగ్రత్త లు పాటిస్తూ జరుపు కోవాలని, ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మర్రిగూడ గ్రామం లో 95 శాతం వ్యాక్సినేషన్ పట్ల అభినందిస్తూ.. మొదటి డోస్ వేయించుకున్న వారు నిర్దేశిత గడువు లోగా రెండవ డోస్ వేయించు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కె.రాజ గోపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, వి.చంద్రశేఖర్, సూర్యాపేట ఎస్.పి.రాజేంద్ర ప్రసాద్, కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వ విద్యాలయం వి.సి. డా.బి.నీరజ ప్రభాకర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, ఆర్.డి.ఓ.గోపి రాం, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి సంగీత లక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఏ.డి. హుస్సేన్ బాబు, మాతా నిర్మల యోగ భారతి, గ్రామ భారతి గౌరవ అధ్యక్షుడు పాలాది మొహనయ్య, చైర్మన్ స్తంభాద్రి రెడ్డి, సెక్రటరీ సూర్యకళ పాల్గొన్నారు.