హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఇకపై చేరబోయే డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ను రద్దుచేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదు. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకోవాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా దశాబ్దాల కాలం నుంచి వినిపిస్తూనే ఉన్నది. స్వాతంత్య్రానికి పూర్వమే ఈ అంశంపై చర్చ జరుగడం గమనార్హం. కొందరు డాక్టర్లు ప్రభుత్వ దవాఖానలో కన్నా ఎక్కువ సమయం సొంత/ప్రైవేట్ హాస్పిటల్లో గడుపుతున్నారని, మరికొందరు చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్కు వస్తే తమ ప్రైవేట్ క్లీనిక్కు రెఫర్ చేస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలు ప్రభుత్వాలు నియమించిన కమిటీలలో అత్యధిక శాతం రద్దువైపే మొగ్గు చూపాయి.
ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ర్టాలు ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ను రద్దు చేశాయి. ఎయిమ్స్, నిమ్స్ల్లోనూ ఎప్పటినుంచో ఈ నిబంధన అమల్లో ఉన్నది. తెలుగు రాష్ర్టాల్లో కూడా ప్రాక్టీస్ రద్దు కొత్తదేం కాదు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేశారు. ఇటీవల తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలోనూ ఇతర రాష్ర్టాల్లో ‘రద్దు’ అమలు విధానాన్ని వివరించినట్టు సమాచారం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ ఈ విధానం సుమారు రెండు దశాబ్దాల నుంచి అమల్లో ఉన్నది. బీహార్, పంజాబ్లోనూ ఇదే పరిస్థితి. అంతేకాదు తాము ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం లేదని ప్రభుత్వ డాక్టర్లు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు ప్రతిపాదనకు అకడి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో అమలు కానున్నది. మధ్యప్రదేశ్లో నిషేధం ఉన్నా.. ప్రభుత్వ వైద్యులు సాయంత్రం తమ ఇండ్లల్లో కన్సల్టేషన్ సేవలు అందించవచ్చని వెసులుబాటు కల్పించింది. జమ్ముకశ్మీర్లో హెచ్వోడీలు ఎవరూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవద్దనే నిబంధన అమల్లో ఉన్నది.
తెలంగాణలో అనేక మంది ప్రభుత్వ డాక్టర్లు తమ ప్రైవేట్ హాస్పిటల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో మంత్రి హరీశ్రావు అనేకమార్లు హెచ్చరించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలవరకు కచ్చితంగా ఉండాలని అనేక సందర్భాల్లో చెప్పారు. బయోమెట్రిక్ విధానాన్ని సైతం అమలు చేశారు. అయినా కొందరు ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. దీంతో కొత్తగా చేరేవారి విషయంలో నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న వారికి పలు ప్రభుత్వం పలు ప్రయోజనాలను కల్పిస్తున్నది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ.75వేలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి రూ.80వేలు వేతనంగా అందుతున్నది. ప్రభుత్వ వైద్యులుగా ఉంటూ పీజీ చేయాలనుకొనే వారికి 30శాతం ఇన్సర్వీస్ కోటా కల్పిస్తున్నది. ప్రస్తుతం పీజీ చేస్తున్న వైద్యులందరికీ వేతనంతో కూడిన సెలవులను అమలు చేస్తున్నది. మొత్తంగా వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని ప్రైవేటు ప్రాక్టీసు ద్వారా వచ్చే ఆదాయం కన్నా ఇదే అధికమని అంటున్నారు.