హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు మంగళం పాడనున్నారు. 1990 నుంచి ఇప్పటివరకు అమలవుతున్న 10 శాతం రిజర్వేషన్లకు ఎగనామం పెట్టేందుకు అక్కడి బీజేపీ సర్కారు పన్నాగాలు పన్నుతున్నది. బీసీలకు గతంలో అమలు చేసిన రిజర్వేషన్ స్థానాలను జనరల్ క్యాటగిరీగా మార్చాలని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేయడం అక్కడి బీజేపీ సర్కారు తీరుకు పరాకాష్ఠ.
జనరల్ స్థానాలుగా నిర్ణయం
గుజరాత్లో 4775 గ్రామ పంచాయతీ స్థానాలు ఉన్నాయి. అందులో ఈ ఏడాది 3200 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఇటీవల నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఆ రాష్ట్రంలో ఓబీసీ జనాభా 52 శాతం. 1990 నుంచి ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 10 శాతం సీట్లు రిజర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీట్లను కూడా జనరల్ స్థానాలకే పరిగణించాలని జూలై 2న ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీల రిజర్వేషన్ ప్రశ్నార్థకంగా మారింది. రిజర్వేషన్ల ఎత్తివేతపై స్వపక్షంతోపాటు, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో చకచకా అడుగులు
సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడగానే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు స్థిరీకరించాలని నిర్దేశిస్తూ రాష్ట్ర బీసీ కమిషన్కు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రత్యేకంగా రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బీసీ కమిషన్ ప్రతినిధులు ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పర్యటించి బీసీల రిజర్వేషన్ల స్థిరీకరణకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. మరో రెండు రాష్ర్టాల్లో పర్యటించి మన రాష్ర్టానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు ఎంపిక చేసుకోవాల్సిన నమూనాను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.
మార్గదర్శకాలివ్వకుండా కాలయాపన
సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఓబీసీల ఒత్తిడి మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో గుజరాత్ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం ఈ ఏడాది జూలై 9న డెడికేటెడ్ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఝవేరిని చైర్మన్గా నియమించి రెండు మాసాలు దాటినా ప్రభుత్వం కమిషన్కు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. నిధులు కేటాయించలేదు. దీంతో రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, ఎప్పుడు ఎత్తివేద్దామనే కుట్రలు చేస్తున్నదని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపి తన విధానాలను అమలు చేస్తున్నదని ఓబీసీ సంఘాల నేతలు, గుజరాత్ రాష్ట్ర నాయకులు మండిపడుతున్నారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీల ఓట్ల కోసమే నామమాత్రంగా కమిషన్ ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సర్కారు తీరుపై ఆ పార్టీ ఓబీసీ నాయకుడు ఆల్పేశ్ ఠాకూర్ బాహటంగానే విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో శరవేగంగా ప్రక్రియ
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కమిషన్ నివేదిక లేకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం లేదు. ఇప్పటికే పలు రాష్ర్టాలు కమిషన్లను ఏర్పాటు చేయడంతోపాటు, ఆ ప్రక్రియను చేపట్టి పూర్తి చేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా కమిషన్కు ఆ బాధ్యతలను అప్పగించింది. వీలైనంత త్వరగా ఆ బాధ్యతలను పూర్తి చేయాలని ఆదేశించింది. కమిషన్ ప్రతిపాదించిన నిధులను సమకూర్చుతున్నది.
-వకుళాభరణం కృష్ణమోహన్రావు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్