హాలియా, ఏప్రిల్ 11: దీపం అంటుకొని తీవ్రంగా గాయపడిన నిరుపేద కుటుంబానికి చెందిన ఆరేండ్ల చిన్నారికి మెరుగైన వైద్యం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ద్వారా ఆదివారం వర్తమానం పంపారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం ముక్కామల గ్రామానికి చెందిన కిలారి సతీశ్, నాగమ్మ నిరుపేద దంపతులు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. సతీశ్ బతుకుదెరువు కోసం పెద్దవూర మండలం చిన్నగూడెంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండగా, నాగమ్మ కూలి పనులకు వెళ్తుంది. అయితే.. వీరి పెద్ద కుమార్తె చైత్ర (6) గతనెల ఒకటిన ఇంట్లో ఆడుకుంటుండగా, దేవుడి గదిలోని దీపం ప్రమాదవశాత్తు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. శరీరం 40 శాతం వరకు కాలిపోవడంతో నల్లగొండ వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని రెయిన్బో దవాఖానలో చేర్చించారు. వైద్యానికి ఇప్పటికే సుమారు రూ.10 లక్షల మేర వెచ్చించారు. వైద్య ఖర్చుల కోసం ఎల్వోసీ కావాలంటూ చైత్ర తండ్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడంతోపాటు చైత్ర వైద్యానికి అయ్యే ఖర్చును ఇక నుంచి ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వాల్సిందిగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఆదేశించారు. ఎమ్మెల్యే కోనప్ప ఆదివారం సాయంత్రం ముక్కామల గ్రామానికి వెళ్లి చిన్నారి బంధువులతో మాట్లాడి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో చైత్ర కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.