హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఆదాయ సముపార్జనే లక్ష్యంగా హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 600 ఎకరాల భూమి, 300 దుకాణాలను విక్రయించాలని నిర్ణయించింది. మంత్రి ఆదేశాలతో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేసిన అధికారులు, పూర్తి వివరాలతో సచివాలయానికి నివేదిక పంపారు. పేద, మధ్య తరగతివర్గాల కోసం హౌసింగ్ కాలనీలు అభివృద్ధిచేసి సరసమైన ధరలకు విక్రయించే ఉద్దేశంతో దశాబ్దాల క్రితమే హౌసింగ్బోర్డుకు అంకురార్పణ జరిగింది. కేపీహెచ్బీ, అమీర్పేట్, ఈసీఐఎల్ తదితర అనేక ప్రాంతాల్లో హౌసింగ్బోర్డు కాలనీలు ఏర్పాటయ్యాయి. కాలక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పేదలకోసం ఉచితంగా అందించే గృహాల నిర్మాణం కోసం హౌసింగ్ కార్పొరేషన్, మధ్యతరగతి వర్గాల కోసం గృహకల్పను కూడా ఏర్పాటుచేశారు. దీంతో హౌసింగ్బోర్డు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. హౌసింగ్ బోర్డుకు సంబంధించి హైదరాబాద్తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 4,609 ఎకరాల స్థలం ఉండగా, అందులో 3,820 ఎకరాల్లో ఇదివరకే కాలనీల నిర్మాణం జరిగింది. మిగిలిన 789 ఎకరాల్లో దాదాపు 80 ఎకరాలపై కోర్టులో కేసులున్నాయి. 610 ఎకరాలు క్లియర్గా ఉన్నది. దీన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇవికాకుండా 150 ఎకరాల భూమి లీజులకు ఇచ్చారు. ఇందులో సుమారు 100 ఎకరాలు జేఎన్టీయూకు ఇవ్వగా, మిగిలింది వివిధ సంస్థలు, వ్యక్తులకు ఇచ్చారు. ఇందులో కొన్ని భూములపై కోర్టులో వివాదాలు కొనసాగుతున్నాయి. హౌసింగ్బోర్డుకు సంబంధించి నగరంలోని ఎంజే రోడ్, మహబూబ్గంజ్, బషీర్పల్లి, విజ్ఞాన్పురి, వెంగళరావునగర్, బర్కత్పుర తదితర ప్రాంతాల్లో 300 దుకాణాలు ఉం డగా, అనేక ఏండ్లుగా అద్దెల సవరణ జరగకపోవడంతో వాటిపై నామమాత్రంగా ఆదా యం వస్తున్నది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 2005లో అప్పటి ప్రభుత్వం ఈ దుకాణాలను విక్రయ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం 11 దుకాణాలను విక్రయించగా, వివిధ కారణాలతో మిగిలిన దుకాణాల విక్రయం నిలిచిపోయింది.
నగరంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో హౌసింగ్బోర్డు ఇప్పుడు కాలనీలు నిర్మించినా వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాలనీలు నిర్మించి రాయితీపై విక్రయించాలనుకున్నా.. లబ్ధిదారుల ఎంపికలో అనేక సమస్యలు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని సంకల్పించి దీనికోసం ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ప్రభు త్వం నిధుల రాబడి కోసం ప్రభుత్వ ఆస్తులు, భూములనే నమ్ముకున్నది. ప్రైవేటు రియల్ఎస్టేట్ సంస్థలు ఆయా వర్గాల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా భారీగా ఇండ్లను నిర్మిస్తూ విక్రయిస్తున్నాయి. దీంతో హౌసింగ్ బోర్డుతో పనిలేకుండా పోయింది. ఈ క్రమంలో హౌసింగ్ బోర్డుకు ఉన్న భూములు, దుకాణాలను విక్రయించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే అధికారుల నుంచి భూములు, దుకాణాల వివరాలతోకూడిన నివేదిక తీసుకున్నది. త్వరలోనే వీటి విక్రయ ప్రక్రియ మొదలవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
హౌసింగ్బోర్డు భూములు, దుకాణాల విక్రయ నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా హౌసింగ్బోర్డులో కొత్త నియామకాలు లేకపోవడం, ఉన్నవారు ప్రతినెలా ఉద్యోగ విరమణ చేస్తుండటంతో ప్రస్తుతం హౌసింగ్బోర్డులో 45 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారు. ఇందులో 13 మంది వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. వచ్చే నాలుగైదేండ్లలో మిగతావారూ విరమణ చేయనున్నారు. భూములు, దుకాణాలను విక్రయించి మిగిలిన ఉద్యోగులను ఇతర విభాగాల్లో సర్దుబాటు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తున్నదని ఉద్యోగులు చెప్తున్నారు. అదే జరిగితే హౌసింగ్బోర్డు ఇక చరిత్రలో కలిసిపోతుందని అంటున్నారు.
హౌసింగ్బోర్డుకు సంబంధించి గృహకల్ప, గగన్విహార్, చంద్రవిహార్, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీసు, మనోరంజన్ కాంప్లెక్స్, తుల్జాగూడ కాంప్లెక్స్, ఎస్ఆర్ నగర్ కాంప్లెక్స్ తదితర భారీ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలకు అద్దెకు ఇచ్చారు. వీటిపై ప్రస్తుతం నెలకు రూ.3 కోట్లవరకు అద్దెలు వస్తుండగా, అవి ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నాయి. ఇందులో ఎక్కువశాతం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఉండటంతో క్రమం తప్పకుండా అద్దెలు వస్తుండటంతో ఉద్యోగుల జీతభత్యాలకు లోటు లేకుండా ఉన్నది. అయితే, ఇందులోనూ కొందరు దుకాణదారులు కోర్టులో లిటిగేషన్లు వేసి అద్దెలు ఇవ్వడంలేదని ఉద్యోగులు చెప్తున్నారు.