హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లోని భూమిని సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు కే రాఘవేంద్రరావు, గోవింద్రెడ్డి తదితరులు కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని, అది ప్రభుత్వ భూమి అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. మాజీ సైనికుల కోటా కింద భూమి కేటాయింపుపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొనడాన్ని బట్టి ఆ భూమి క్రయ, విక్రయాలు చట్ట విరుద్ధమని అదనపు ఏజీ జే రామచందర్రావు వాదించారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పడంతో భూమి కొనుగోళ్ల వివాదంపై విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ నందతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖానామెట్లోని 26.16 ఎకరాల హకులపై జోక్యం చేసుకోరాదంటూ సింగిల్జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. రామానాయుడు తరఫు న్యాయవాది శ్రీరఘురాం వాదిస్తూ.. భూమి పత్రాలు ఫోర్జరీ కాలేదంటూ 2003లో భూ కమిషనర్ నిర్ధారణ చేశారని, రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యంతరాలు కూడా వ్యక్తం కాలేదని చెప్పారు. ఈ వివాదంపై హెచ్ఎండీఏ చేసిన అప్పీల్ను హైకోర్టు కొట్టేసిందని, ఇప్పుడు ప్రభుత్వం అప్పీల్ చేసిందని వివరించారు.