హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేయకుండానే కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ తుది ఉత్తర్వులు జారీచేసింది.
బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చైన్ టెక్నాలజీ, రొబోటిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల పెంపునకు జేఎన్టీయూ గుర్తింపు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు 23 ప్రధాన పిటిషన్లు, పలు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటన్నింటినీ ధర్మాసనం కొట్టేసింది. నూతన కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ పలు కాలేజీలు హైకోర్టులో సవాల్చేశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదిస్తూ, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని, డిమాండ్ ఉన్న కోర్సులకు అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
జేఎన్టీయూ తరఫున న్యాయవాది మయూర్రెడ్డి వాదిస్తూ ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కన్వీనర్ తరఫున సీ వాణిరెడ్డి వాదనలు వినిపించారు. వాదనల తర్వాత హైకోర్టు.. ఏఐసీటీఈ చట్టానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేవు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నది. సంగం లక్ష్మీబాయి విద్యాపీఠ్ కేసులో ఏఐసీటీఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రం చట్టం లేదని చెప్పింది.
విద్యాచట్టంలోని సెక్షన్ 20 అమలుకు వీల్లేదన్న కాలేజీల వాదనలో పసలేదని స్పష్టంచేసింది. సర్వేలు, అవసరాలు, డిమాండ్లు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో ప్రభుత్వానికి తాము ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కొత్త ఏడాదిలో సీట్ల పెంపు, కొత్త కోర్సుల ప్రారంభానికి ఏఐసీటీఈ అనుమతి మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనను గత నవంబర్ 12న విద్యా శాఖ తిరసరించిందని తెలిపింది. సీట్ల పెంపు, కొత్త కోర్సుల ప్రారంభానికి ప్రభుత్వం నుంచి ఎన్వోసీ విధిగా తీసుకోవాలని, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినంతమాత్రాన కాలేజీలు ప్రారంభించలేవని తీర్పులో పేరొన్నది. విశ్వవిద్యాలయాల నిబంధనలను సమర్థించింది. వాటిని సవాల్ చేసిన అన్ని రిట్లను డిస్మిస్ చేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.