హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): దేశంలో కులవృత్తులను గౌరవించిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372 జయంతిని ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్గౌడ్తోపాటు, ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. అంటరాని తనాన్ని రూపుమాపేది గౌడ కులవృత్తి అని చెప్పారు. ఆనాటి దుర్మార్గపు వ్యవస్థపై పోరాడిన యోధుడు పాపన్న అని, ఆయన ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని తెలిపారు.
గౌడ ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించే భవనానికి సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్గా నామకరణం చేస్తామని వెల్లడించారు. సర్వాయి కోటను రక్షించాలని 30 ఏండ్లుగా పోరాడుతున్నా ఉమ్మడి పాలకులు స్పందించలేదని, సీఎం కేసీఆర్కు దృష్టికి తీసుకెళ్లిన 24గంటల్లో కోట పరిరక్షణకు చర్యలు తీసుకున్నారని కొనియాడారు. హైదరాబాద్లో కల్లు దుకాణాలను పునరుద్ధరించారని, చెట్టుపన్నును శాశ్వతంగా తొలగించి, నీరా పాలసీని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు.
బలహీనవర్గాలను గౌరవించిన ఘనత కేసీఆర్దే: జోగి రమేశ్
బలహీనవర్గాలు, గౌడలను గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. గౌడ సామాజికవర్గానికి సముచిత స్థానం ఇచ్చిన పాలకులను గుండెల్లో పెట్టుకోవాలని గౌడలకు పిలుపునిచ్చారు. జాతి మేల్కొనాలంటే విద్య ఒక్కటే మార్గమని, అందుకోసం బహుజనులకు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆత్మగౌరవ భవనాల పేరిట ఐదెకరాల స్థలంతోపాటు రూ.5 కోట్ల నిధులివ్వడం గొప్పవిషయమని పేర్కొన్నారు.
5 కోట్ల ఈత మొక్కలు నాటాలి: ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్
పాపన్న జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ అన్నారు. 5 కోట్ల ఈత మొక్కలు నాటేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమ జాతీయాధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్, సంఘం తెలంగాణ అధ్యక్షుడు నరేశ్గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కిశోర్గౌడ్, సంఘం నేతలు అనూరాధగౌడ్, శివపార్వతి, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావు గౌడ్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల గౌడ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.