మల్కాజిగిరి/అల్వాల్, నవంబర్ 21: కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గౌడ సంఘం సంపూర్ణ మద్దతునిస్తున్నదని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్ తెలిపారు. మంగళవారం అల్వాల్ లోతుకుంటలో గౌడ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టూ ఉన్న 270 సోసైటీలు 103 కల్లు దుకాణాలను గత 2006లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూసివేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ నిర్ణయంతో నాడు లక్షమంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మొదటి మంత్రివర్గ సమావేశంలో కల్లు, గీత కార్మికుల సంక్షేమం కోసం కల్లు దుకాణాలను తెరువాలని నిర్ణయించారని చెప్పారు. ఏటా రూ.20 కోట్లు కిరాయిని సైతం మాఫీ చేశారని కొనియాడారు. సర్దార్ పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్తి మద్దతు తెలుపుతున్నామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి, మాజీ కో ఆప్షన్ మెంబర్ జ్యోతిగౌడ్, గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్గౌడ్, నేమూరి శ్రీధర్గౌడ్, మల్లేశ్గౌడ్, శోభగౌడ్, రాజేశ్కన్న, నక్క రాజేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.