హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి కొత్తగూడెం దాకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్రకు అడుగడుగునా జనం పోటెత్తారు. ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వర్రావు గెలుపు కోసం సోమవారం ఖమ్మం, మంగళవారం కొత్తగూడెంలో రెండుచోట్లా రోడ్షోల్లో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్స్ వెళ్తుందని చెప్తున్న ప్రధాని మోదీ సీఎం రేవంత్రెడ్డిపై ఈడీ విచారణ ఎందుకు చేయరని రెండుచోట్లా కేసీఆర్ ప్రశ్నించారు. అన్నారుగూడెం గ్రామంలో అంతా కోడెకత్తు (యువకులు). ఎవ్వరిమెడలో కండువా లేదు. నెత్తిన ఏ పార్టీ టోపీలేదు. కేసీఆర్ కనిపించగానే ‘జై కేసీఆర్..’ అని నినదిస్తూ పరుగులు పెట్టారు. ఏన్కూర్ క్రాస్ వద్ద ఓ సింగిల్ఫ్లోర్ బిల్డింగ్. ఓ తల్లి ఇద్దరు చిన్నారులతో భవనం పైకెక్కి అదిగదిగో కేసీఆర్ అంటూ బస్సు వైపు చూపిస్తూ తన చేతిలో ఉన్న సెల్ఫోన్తో క్లిక్మనిపిస్తూ కిలుక్కున నవ్వింది.
కొత్తగూడెం రోడ్షోలో ఆదివాసీ గిరిజనులు కోలాహలం సృష్టించారు. పినపాకలోని దొంగతోపు అనే గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించామని కేసీఆర్ పేర్కొన్నప్పుడు యువకులు, కళాకారులు తమ హర్షద్వానాలు వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో కేసీఆర్ రోడ్షోలో వివిధ కళారూపాలను ప్రదర్శించిన కళాకారులు ఈలలు వేస్తూ.. కొమ్ముబూరను ఊది కృతజ్ఞతను చాటుకున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 200 6 ఫిబ్రవరి 12న ‘పోలవరం గర్జన’ పేరుతో నిర్వహించిన సభకు హాజరైన కోయ గిరిజన యువకుల్లో ఒకరు నాటి సంగతిని గుర్తుచేసుకున్నారు. జేఎంఎం నేత శిబూసోరెన్ను అప్పుడే కేసీఆర్ భద్రాచలం తీసుకొచ్చారని, అప్పటి నుంచి ఇప్పటిదాకా తాము కేసీఆర్తోనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.