హైదరాబాద్, జూలై 29 : నగరంలోని కొత్తగూడ కేవీబీఆర్ బొటానికల్ పార్క్ వాకర్స్ వార్షిక, నెల వారీ పాసుల రెన్యువల్, కొత్త పాసులకు దరఖాస్తు, సందర్శకుల ప్రవేశ టికెట్ల ఆన్ లైన్ సేవలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేవీబీఆర్ బొటానికల్ గార్డెన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించి ఆన్ లైన్ సేవలను ప్రారంభించారు. అనంతరం బొటానికల్ గార్డెన్ థీమ్ పార్క్ బ్రోచర్ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు HDFC బ్యాంక్ ఇచ్చిన రూ. 87.75 లక్షల చెక్కును మంత్రి కి అందజేశారు. చిల్కూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కల పెంపకానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతు బాధ్యతగా మొక్కల పెంపకానికి విరాళం ఇచ్చిన HDFC బ్యాంక్ ప్రతినిధులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.