హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): అటవీ ఉత్పత్తుల ద్వారా అడవి బిడ్డలకు స్వయం ఉపాధి మార్గాలను చూపాలని ప్రభుత్వం సంకల్పించింది. గిరిజనులను సంఘటితపరిచి వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే శాశ్వత ఉపాధి కల్పించినట్టు అవుతుందని భావించింది. ఊట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలో 17 వన్ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పా టు చేసింది. వీటి పరిధిలోని 5,100 మంది అటవీబిడ్డలకు ‘వన్ధన్’ కేంద్రాల ద్వారా శాశ్వత ఉపాధిని కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందు కుసాగుతున్నది. ఈ కేంద్రాల్లోని సభ్యులకు మార్కెటింగ్ మెళకువలు నేర్పించి వారిని స్వయం ఉపాధి శక్తిగా మార్చేంచేదుకు గిరిజన సంక్షేమశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
ఆధునిక విధానాలపై శిక్షణ
ఊట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలోని ప్రతి గిరిజన గ్రామంలో ప్రభుత్వం 20 మంది చొప్పున సభ్యులతో స్వ యం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. ఈ విధంగా 255 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ సంఘాల్లోని సభ్యులకు జూలై 19 నుంచి 28 వరకు తొలివిడత శిక్షణలో ఇప్ప, కుంకుడు, అడ్డతీగ, తేనె లాంటి అటవీ ఉత్పత్తుల సేకరణకు అనుసరించాల్సిన వినూత్న పద్ధతులను వివరించారు. ఉత్పత్తుల సేకరణకు యంత్రాలు, పరికరాలు, రక్షణ కవచాలను పంపిణీ చేయాలని జీసీసీ నిర్ణయించింది. ఇందుకోసం గిరిజన సంక్షేమశాఖ రూ.2.25 కోట్లు విడుదల చేసింది. అంటే ప్రతి సభ్యుడికి సగటున రూ.5,000 ఖర్చుచేస్తున్నది. వన్ధన్ కేంద్రాల సభ్యులకు వారి ప్రాంతాల్లో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులపై సంపూర్ణ అవగాహన కల్పించడంలో జీసీసీ, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ములుగు) అధికారులు నిమగ్నమయ్యారు. తొలిదశలో 255 స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు చొప్పున చురుకైన సభ్యులను ఎంపికచేసి ములుగు ఫారెస్ట్ కాలేజీలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వీరంతా తమ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అటవీ ఉత్పత్తులకు మంచి డిమాండ్
ప్రస్తుతం అటవీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని జీసీసీ డిప్యూటీ మేనేజర్ ఎన్ విజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛతను, నాణ్యతను కోరుకొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ మార్గదర్శకత్వంలో వన్ధన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.