హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఎమ్మెల్యేగా సునీత ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్కు గత నాలుగున్నర ఏండ్లలో ఆమె కౌంటర్ వేయకపోవడాన్ని జస్టిస్ ఎం లక్ష్మణ్ తప్పుపడుతూ మంగళవారం ఈ జరిమానా విధించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు సునీత తన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను గోప్యంగా ఉంచారని సతీశ్రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు.
ఇది విచారణలో ఉండగానే ఆయన మరణించడంతో ఆలేరు కాంగ్రెస్ నేత బోరెడ్డి అయోధ్యరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎమ్మెల్యే సునీత తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ వేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. కౌంటర్ వేయని పక్షంలో అక్టోబర్ 3న జరిగే విచారణలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది.