హైదరాబాద్ : నేటి తరం పిల్లలు భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలంటే పుస్తకాలను నిరంతరం చదువాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నగరం బాగ్ లింగం పల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ సామాజిక ,ఆర్ధిక ,రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకుని వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలంటే పుస్తక పఠనం అవసరమని అన్నారు.
కరోనా వల్ల ఆన్ లైన్ క్లాస్ లు, జూమ్ క్లాస్ లకు పరిమితమైన విద్యార్థులు ఇప్పుడిప్పుడే పుస్తకాల వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులని, మంచి పుస్తకాలు చదివి,గొప్ప మేధస్సు ను పెంచుకొని దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నవ తెలంగాణ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.
పుస్తకాలను చౌక ధరల్లో చిన్నారులకు అందుబాటులోకి తేవటం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇన్చార్జి ఎస్ వినయ్ కుమార్, నవ తెలంగాణ పబ్లిషర్స్ నిర్వాహకులు వాసు, ఆనంద చారి, తదితరులు పాల్గొన్నారు.