హైదరాబాద్ : అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు యత్నించిన ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి జీ-9458 విమానంలో ఓ ప్రయాణికుడు ఆర్జీఐ విమానాశ్రయంలో దిగాడు. అతడి కదలికపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. 672 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి ప్రత్యేకంగా రూపొందించిన చెప్పుల్లో దాచినట్లు గుర్తించారు. 594 గ్రాముల నికర బంగారాన్ని స్వాధీనం చేసుకొని, ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ 27.4 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా షార్జా నుంచి 6E-1406 విమానంలో వచ్చిన నలుగురు ప్రయాణికులు బంగారం ముక్కలను నోటిలో దాచుకొని రవాణా చేసేందుకు యత్నించారు. వీరి నుంచి 471 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ .20.67 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.