హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): డప్పుల మోతలు.. గజ్జెల సవ్వళ్లు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాల నడుమ గోల్కొండ.. ఆషాఢమాస బోనం ఎత్తింది. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బోనాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండలోని జగదంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించటంతో రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మవారికి ఆలయ కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.