రాజన్న సిరిసిల్ల, మార్చి 8 (నమస్తే తెలంగాణ): 15 వేల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్క్ తెలంగాణకే తలమానికం కానున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో ఇప్పటికే పలు కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిరుడు లోదుస్తుల ఉత్పత్తిని ప్రారంభించిన గోకుల్దాస్ కంపెనీ వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నది. రెండు వేల మందికి ఉపాధి కల్పించే దిశగా మరో అంతర్జాతీయ కంపెనీ టెక్స్పోర్టు ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు వేస్తున్నది. కాగా, మరమగ్గాలపై కేవలం పురుషులు మాత్రమే ఉపాధి పొందుతుండగా.. మహిళలకూ పెద్దఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కేటీఆర్ అప్పారెల్ పార్క్ ఏర్పాటు చేయించారు. సిరిసిల్ల శివారులోని సర్దాపూర్లో రూ.170 కోట్లతో 65 ఎకరాల్లో ఈ పార్క్ రూపుదిద్దుకున్నది. ఇక్కడ గార్మెంట్ పరిశ్రమలతోపాటు సూటింగ్, షర్టింగ్ నుంచి మొదలు అన్నిరకాల దుస్తులు తయారుచేసే కంపెనీలు ఏర్పాటు చేసుకునే వీలుగా షెడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుంది.
అప్పారెల్ పార్కులో షెడ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు టీఎస్ఐపాస్ వెనువెంటనే లైసెన్సులు జారీ చేస్తున్నది. ప్రస్తుతం పార్క్లో రెండు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అందులో గోకుల్దాస్ కంపెనీ ఉత్పత్తులు ప్రారంభించింది. మరో అంతర్జాతీయ కంపెనీ.. టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ త్వరలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. టెక్స్పోర్ట్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం 7.40 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం షెడ్ల నిర్మాణం చివరిదశకు చేరుకున్నది. ఈ కంపెనీలో మొత్తం 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మొదటి విడతలో 800 మెషిన్లతో రెండు షిప్టుల్లో 1,600 మందికి, రెండో విడతలో వెయ్యి మెషిన్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో సూటింగ్, షర్టింగ్ దుస్తులు ఈ కంపెనీలో తయారు చేయనున్నారు. బెంగళూరు, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ వేలాది మందికి ఉద్యోగాలు కల్పించింది. భారీ పెట్టుబడులతో నడుస్తున్న టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్లకు వచ్చింది. అప్పారెల్ పార్క్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నందున నిరుద్యోగ యువతలో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన దుస్తుల తయారీతో వేలాది మందికి అప్పారెల్ పార్కు ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నందుకు నిరుద్యోగ యువతలో సంతోషం వ్యక్తమవుతున్నది. సమైక్య పాలనలో నిర్వీర్యమైన వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పునర్జీవం పోసింది. మంత్రి కేటీఆర్ చొరవతో బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాంల తయారీ ఆర్డర్లు నేరుగా వస్త్ర పరిశ్రమకు ఇచ్చి వేలాది మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తీసుకొచ్చారు.
అప్పారెల్ పార్క్లో పెట్టుబడుల కోసం మంత్రి కేటీఆర్ పలుమార్లు అమెరికాలో పర్యటించారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పలు కంపెనీలతో చర్చించి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొనేలా కృషి చేశారు. అందులోభాగంగా గోకుల్దాస్ కంపెనీ దాదాపు రూ. 23.58 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. పరిశ్రమను ప్రారంభించి, ఏడాదిలోనే వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించింది. 500 జూకీ మెషిన్లతో మొదటి దశలో 500 మందికి నైపుణ్య శిక్షణనిచ్చిన ఈ కంపెనీ ప్రస్తుతం వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇందులో పనిచేస్తున్న మహిళా కార్మికులు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పైగా సంపాదిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన మహిళలే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నారు. వీరికి కంపెనీ ఇంటర్సిటీ పేరిట ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రెండు షిప్టులలో వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు.