ఢిల్లీ : తెలంగాణలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాల్సిందిగా రాష్ట్రం అందజేసిన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు, తదితర అంశాలపై విన్నవించేందుకు రాష్ట్ర ప్రతినిధుల బృందం ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్, అర్కియాలజి డీజీ విద్యావతితో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాశ్, వెంకటేష్ నేత, మాలోత్ కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియంలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. అదేవిధంగా గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైటింగ్ షో వేదిక మార్చాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కల్చరల్ ఆడిటోరియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సాంస్కృతిక వైభవం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి అత్యధిక పన్నులు చెల్లిస్తున్నా ఆశించినంతగా సహకారం రావటం లేదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. రామప్ప దేవాలయానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఖిలా వరంగల్, వేయిస్థంబాల అలయ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. చరిత్ర కలిగిన దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. నిధుల విడుదల, పనుల వేగం పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సర్ధార్ పాపన్న కోట, జఫర్గడ్ కోట, పాలకుర్తి బమ్మెర పోతన సమాధుల అభివృద్ధి, పాలకుర్తి అలయాభివృద్ది చేయాలని కోరినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. యూనెస్కో పంపిన సాంకేతిక నిపుణుడు కూడా రామప్ప అలయం గుర్తింపునకు అవకాశం ఉందన్నాడు. యూనెస్కో సమావేశం త్వరలోనే ప్యారిస్ లో జరగబోతోంది. ఎలాగైనా ఈసారి రామప్పకు యూనెస్కో గుర్తింపు లభించేలా కేంద్రంతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని అంశాలపై వారు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.