ముస్తాబాద్, మార్చి 6: కాళేశ్వర గంగ తరలివస్తున్నది. మెట్టను తడిపేందుకు పరవళ్లు తొక్కుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్కు ఆదివారం గోదావరి జలాలు చేరుకొన్నాయి. మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా వస్తున్న నీరు మండలంలోని మోహినికుంట, మద్దికుంట గ్రామాల్లోని చెరువులకు చేరడంతో ఆదివారం మండల ప్రజాప్రతినిధులు, రైతులు కాల్వల వద్ద గంగమ్మకు పూజలు చేశారు. అపర భగీరథుడు సీఎం కేసీఆర్, అమాత్యుడు కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రజక సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బోంపెల్లి సురేందర్రావు, సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు పాల్గొన్నారు.