నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లు నీటమునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi Kumari).. జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి (Godavari river) నదిలో ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar project) వరద నీరు చేరుతున్నది. ప్రస్తుతం 30 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ఇప్పుడు 1090 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు నీటినిలువ సామర్థ్యం 90 టీఎంసీలకుగాను 85.3 టీఎంసీలు ఉన్నాయి.